అమనగల్లు మండలం మేడిగడ్డ తాండ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సి.ఎస్.ఆర్. నిధుల నుంచి రూ.2 లక్షలు మంజూరు కావడంతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
స్థానిక సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్, ఉప సర్పంచ్ విజయ్ రాథోడ్ వార్డు సభ్యులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులు, యువతతో పాటు పుస్తక ప్రియులకు నూతన గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. గ్రంథాలయం అందుబాటులోకి వస్తే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, పఠన అలవాటును పెంపొందించుకునేందుకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లేష్, దేవేందర్, సీతారాం, జయందర్, కవిత మణిపాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని స్థానికులు కోరారు.









