హిమాలయ దేశం నేపాల్ను అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక వరదలు, ఆకస్మిక ప్రవాహాలు, కొండచరియల ఘటనలపై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకృతి విపత్తుల్లో ఏకంగా 320 మంది భారతీయులు గల్లంతైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 400 మంది భారతీయ పౌరులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. వారితో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రహదారుల కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నేపాల్లో వరదలు, కొండచరియల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. భారతీయుల భద్రత, ఆచూకీపై భారత ప్రభుత్వం నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తోంది. గల్లంతైన వారి వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.









