క్రికెట్ ప్రపంచంలో మరోసారి సంచలనం నమోదైంది. గతేడాది అక్టోబర్లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన నమీబియా.. సరిగ్గా 10 నెలల వ్యవధిలోనే మరోసారి అదే అద్భుతాన్ని చేసి చూపించింది. ట్రై సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 18 పరుగుల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. పసికూన జట్టు మరోసారి అగ్రశ్రేణి జట్టుకు షాక్ ఇవ్వడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ ఫ్రైలింక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 60 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ 41 పరుగులతో అతడికి మంచి సహకారం అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యం నమీబియా ఇన్నింగ్స్కు బలమైన పునాది వేసింది.
కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 19 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. అయినప్పటికీ ఓపెనర్ల సహకారంతో నమీబియా పోరాడే స్కోరును నమోదు చేసింది. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికాను 18 పరుగుల తేడాతో కట్టడి చేశారు. దీంతో 10 నెలల వ్యవధిలోనే దక్షిణాఫ్రికాపై నమీబియా రెండోసారి విజయం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది.









