ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో కూడిన ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కడంపై జనసేన పార్టీ నాయకుడు నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ఈ కీలకమైన బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ నియామకాన్ని తాను కేవలం ఒక ప్రొటోకాల్ లేదా అధికార హోదాగా పరిగణించడం లేదని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తనపై మోపిన గురుతర బాధ్యతగా భావిస్తున్నానని నాగబాబు స్పష్టం చేశారు. మొక్కలు నాటడం, పర్యావరణాన్ని ప్రేమించడం అనేది తన నిత్య జీవనశైలిలో ఎప్పటి నుంచో ఒక అంతర్భాగంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించి, ఆంధ్రప్రదేశ్ను మరింత ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని నాగబాబు హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతానని ఆయన వెల్లడించారు.









