ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ క్రేజ్: నకిలీ యాప్‌లతో టికెట్లు కొంటే మీ కష్టార్జితం గల్లంతే.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 22వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్ల పోరును ప్రత్యక్షంగా చూడాలనే అభిమానుల ఆతృతను సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. నకిలీ యాప్‌లు, మోసపూరిత వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల విక్రయం పేరిట దోపిడీకి తెరలేపడంతో, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్రికెట్ ప్రియులను హెచ్చరించారు.

ప్రస్తుతం ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఐపీఎల్ టికెట్లకు సంబంధించిన ఆకర్షణీయమైన ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ (District) యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లను, క్లోన్ వెబ్‌సైట్లను సైబర్ కేటుగాళ్లు సృష్టించారు. అసలు యాప్‌ను తలపించేలా లోగోలు, డిజైన్లు ఉపయోగించి, తక్కువ ధరలకే ప్రీమియం స్టాండ్ టికెట్లు ఇస్తామంటూ నకిలీ లింకులను, ఏపీకే (APK) ఫైళ్లను పంపుతూ అమాయక ప్రజలను ఊరిస్తున్నారు.

ఈ మోసాలపై సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఐపీఎల్ టికెట్ ప్రకటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక యాప్‌ను పోలిన నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేస్తే డబ్బులు కోల్పోవడమే కాకుండా, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారని, ఎవరైనా ఇలాంటి లూటీకి గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు