ఆనందపురం దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉదయం 10:15 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం నుంచి సింహాచలం పెళ్లికి వెళ్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పింది. ముందుగా రోడ్డు డివైడర్ను ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీ/కంటైనర్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న విజయనగరం జిల్లా దెంకాడ మండలం బొడ్డవలసకు చెందిన కోన రవికిషోర్ (36) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న రౌతు వరలమ్మ, కోన వరలమ్మ, రౌతు దుర్గ, కురుముంజి వరలక్ష్మి, బంటుపల్లి లక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో అక్కడ కొంతసేపు భయానక వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.









