భద్రాచలం : నవంబర్ : 15
- ఫుట్ పాత్ లను క్లియర్ చేయాలి.
- డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి.
- అక్రమ నిర్మాణాలకు చేయూతనిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి.
- ఐటీడీఏ పీవో, కలెక్టర్ లు స్పందించాలి.
- సామాజిక కార్యకర్త. పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్.
భద్రాచలం పట్టణంలో విచ్చలవిడిగా ఫుట్ పాత్, డ్రైనేజీలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు యదేచ్చగా నిర్మించారని, ప్రజలు నడిచేందుకు వీలుగా నిర్మించిన ఫుట్ పాత్ లను ఆక్రమించడం తీవ్రమైన చర్యగా పరిగణించాలని, తాము నడిచేందుకు,తమ కోసం ఏర్పరిచిన ఫుట్ పాత్ ను తక్షణమే క్లియర్ చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో అవినీతి సామ్రాజ్యం పెట్రేగుతూ విచ్చలవిడిగా అధికార యంత్రాంగాన్ని లోబరుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలిబాటను సైతం ఆక్రమించి అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం, దానికి సంబంధిత అధికారులు చేయూతనిచ్చే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా స్పందించకపోవడం సరైన పద్ధతి కాదని ప్రదీప్ అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంత చట్టాలను పరిరక్షించాల్సిన అధికారులు ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా తమకున్న రాజకీయ పలుకుబడి, అండదండలతో తాము చెప్పిందే శాసనం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కంచె చేనును మేసే విధంగా తయారైందన్నారు. ఆదివాసీ సంఘాలు, ఆర్టిఐ కార్యకర్తలు అధికారులకు వినతి పత్రాలు అందించినా చట్ట ఉల్లంఘన చేస్తూ చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను పర్యవేక్షించి, గిరిజనుల అబి వృద్దే ధ్యేయంగా పనిచేస్తూ, ఏజెన్సీ చట్టాలను కాపాడవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు, భద్రాచలంలో జరుగుతున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, పట్టణంలో విచ్చలవిడిగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నా తమకేమి సంబంధం లేదన్నట్లు చోద్యం చూస్తున్న గ్రామపంచాయతీ అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై త్వరలోనే కోర్టులో ఫిర్యాదు చేసి చట్టాలను పరిరక్షించుకునే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేశారు ప్రదీప్ కుమార్.









