ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరు కావడానికి అరవింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. ఈ మేరకు ఆమెకు నేరుగా ఒక లేఖ రాస్తూ, వ్యక్తిగతంగా లేదా తన తరపు న్యాయవాది ద్వారా కూడా కోర్టుకు రాబోనని స్పష్టం చేశారు. హైకోర్టులో తనకు నిష్పక్షపాతంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని ఆయన ఆ లేఖలో బాహాటంగానే పేర్కొనడం ఇప్పుడు న్యాయ మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.
న్యాయస్థానంపై నమ్మకం కోల్పోయిన తరుణంలో తాను మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఇందులో భాగంగా గాంధీ విగ్రహం ఎదుట దీక్షకు దిగనున్నట్లు ఆయన తెలిపారు. “జీవితంలో కొన్నిసార్లు గెలుపు ఓటముల కంటే సిద్ధాంతాలే ముఖ్యం.. అందుకే కష్టమైనా సరే సత్య మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తనపై నమోదైన కేసుల్లో నిర్దోషిగా తేలిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విచారణ తీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కోర్టు విచారణకు హాజరు కాబోనని ప్రకటించడం తీవ్రమైన పరిణామంగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని తనను వేధిస్తోందని, దీనిపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో న్యాయ పోరాటం కాస్తా ప్రజా పోరాటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇచ్చే తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు.









