ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (ఎస్సీఓఆర్) తాత్కాలిక కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలను ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తూర్పు, దక్షిణ మధ్య మరియు దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతి, అలాగే కొత్తగా ఏర్పాటైన జోన్ భవిష్యత్ కార్యకలాపాలపై అధికారులు ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.
కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్లో కొన్ని పాలనాపరమైన మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఏపీ పరిధిలోని అరకు – కొత్తవలస, కర్నూలు – డోన్ సెక్షన్లను ఈ కొత్త జోన్లో విలీనం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల మరింత అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన సూచించారు. రాష్ట్రంలో రైల్ రూట్ డెన్సిటీ తక్కువగా ఉందని, ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చే లక్ష్యానికి అనుగుణంగా పోర్టుల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాల హింటర్ ల్యాండ్ను రైల్వే మార్గాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.









