కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో గుండెలను పిండేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో కన్నకొడుకు కళ్లెదుటే ప్రాణాలు వదలగా, ఆ మృతదేహాన్ని తరలించేందుకు కనీసం వాహనం కూడా లేని దుస్థితిలో ఆ నిరుపేద తల్లిదండ్రులు తమ జీవనాధారమైన తోపుడు బండిపైనే శవాన్ని ఉంచి ఇంటికి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.
గ్రామానికి చెందిన ఎల్కపెల్లి వీరయ్య, రుక్కమ్మ దంపతులు తోపుడుబండిపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు యాకూబ్ (38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించింది. కంగారుపడిన తల్లిదండ్రులు 108 అంబులెన్స్కు సమాచారం అందించినప్పటికీ, అది వచ్చేలోపే యాకూబ్ తుదిశ్వాస విడిచాడు. మరణించిన వ్యక్తిని తరలించేందుకు అంబులెన్స్ నిబంధనలు అంగీకరించకపోవడంతో వారు వెనుదిరిగారు.
దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు, తమ వద్ద వాహనానికి ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తాము పండ్లు అమ్ముకునే బండినే పాడెగా మార్చుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని బండిపై వేసుకుని వీధుల గుండా వెళ్తుంటే ఆ తల్లిదండ్రులు పడిన వేదన వర్ణనాతీతం. నిరుపేదల బతుకులు ఇంత దయనీయంగా ఉంటాయా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.









