కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాడులు చేయడం, దౌర్జన్యాలకు దిగడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేస్తూనే, తమ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించి పరీక్షించవద్దని ఆయన బీఆర్ఎస్ శ్రేణులను గట్టిగా హెచ్చరించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన అరాచకాలతో నిండిపోయిందని, అది రజాకార్ల పాలనను తలపించిందని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో తాను చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు అనేక ఇబ్బందులు సృష్టించారని, పదుల సంఖ్యలో కార్లను ధ్వంసం చేయడమే కాకుండా మహిళా కార్యకర్తలపై కూడా దాడులకు తెగబడ్డారని ఆయన గుర్తు చేశారు. నాడు అరాచకాలకు పాల్పడిన వారే నేడు సానుభూతి కోసం ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు.
దాడుల సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీయే ఆరంభించిందని ధ్వజమెత్తిన బండి సంజయ్, ప్రస్తుత నేతల నీతి వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందని అన్నారు. పదేళ్లలో ఆ పార్టీ చేసిన అకృత్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ శ్రేణులు ఇప్పటివరకు సహనంతో ఉన్నాయని, ఆ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఘటనపై జరిగిన ఆలస్యమైన స్పందనలో బీఆర్ఎస్ నాయకుల వైఖరిని ఆయన ఎండగట్టారు.









