గత ఎన్నికల్లో తమను ఓడించారన్న అక్కసుతోనే నిరుద్యోగ యువతపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో “నిరుద్యోగ యువతపై గొడ్డలివేటు” పేరిట నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై రాజకీయ దురుద్దేశంతో వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడిన ఆయన, ఈ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని జగన్, ఎన్నికలకు ముందు అసమగ్ర డీఎస్సీ ప్రకటిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలను రవినాయుడు తీవ్రంగా ఖండించారు. క్రీడాకారులకు సర్టిఫికేట్లు ఇచ్చేది అసోసియేషన్లు, ఫెడరేషన్లేనని, వాటిని పూర్తిస్థాయిలో ధృవీకరించుకున్నాకే 427 పోస్టులను భర్తీ చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేస్తే దానిపై నిందలు వేయడం దారుణమన్న ఆయన.. తమ హయాంలో, గత వైసీపీ హయాంలో జరిగిన స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈ దుష్ప్రచారాల వల్ల డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు మరియు వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డిలు సైతం వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పేపర్లను మంగళగిరి వద్ద డ్రైవర్లు, పనివాళ్లతో దిద్దించిన ఘనమైన చరిత్ర వారిదని సంచలన ఆరోపణలు చేశారు. అటువంటి చరిత్ర ఉన్న వైసీపీకి, పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసే నైతిక అర్హత లేదని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టామని, తప్పు జరిగిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతామని స్పష్టం చేస్తూ, నిరుద్యోగుల ఆశలపై విషం చిమ్ముతున్న వారిని యువత ఏకమై తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.









