మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్న జపాన్, తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఇతర దేశాల నుంచి వలసదారులను ఆహ్వానిస్తోంది. అయితే వలస వచ్చిన వారు స్థానిక నిబంధనలు పాటించకుండా మతపరమైన కట్టడాలు నిర్మించడాన్ని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్లో నివసిస్తున్న పాకిస్థానీలు ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా ఒక మసీదును నిర్మించడం ఇప్పుడు దౌత్యపరమైన, న్యాయపరమైన వివాదానికి దారితీసింది. రాజధాని టోక్యో సమీపంలోని కావాగోయ్ సిటీలో నిర్మించిన ఈ మసీదును ఏప్రిల్ 3న జపాన్లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ ఘనంగా ప్రారంభించారు.
అయితే జపాన్ సిటీ ప్లానింగ్ యాక్ట్ ప్రకారం, సదరు మసీదును నిర్మించిన ప్రాంతంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు అనుమతులు తప్పనిసరి. స్థానిక అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ మసీదుకు ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేవని తేలింది. దీంతో కావాగోయ్ నగర అధికారులు ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. నిబంధనల ఉల్లంఘనకు గానూ మసీదు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేస్తూ, తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూకంపాలు ఎక్కువగా వచ్చే జపాన్లో భవన నిర్మాణ మరియు జోనింగ్ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే.
ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో టోక్యోలోని పాకిస్థాన్ ఎంబసీ లబోదిబోమంటూ ఈ ప్రాజెక్టు నుంచి చేతులు దులిపేసుకుంది. చట్టపరమైన అనుమతులన్నీ ఉన్నాయని నిర్వాహకులు నమ్మబలికడం వల్లే తమ రాయబారి ప్రారంభోత్సవానికి వెళ్లారని సమర్థించుకుంది. ఈ అక్రమ నిర్మాణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ.. స్థానిక చట్టాలను గౌరవించాలని జపాన్లోని తమ దేశ పౌరులకు సోషల్ మీడియా ద్వారా సూచించింది. పాక్ రాయబారి స్వయంగా హాజరై ప్రారంభించిన కట్టడమే అక్రమమైనదిగా తేలడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.









