జైలు నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం వరకు.. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఇదే!

కర్ణాటక రాజకీయాల్లో ‘ట్రబుల్ షూటర్’గా పేరుగాంచిన డీకే శివకుమార్ చిరకాల స్వప్నం నెరవేరింది. ఆయన బుధవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో కర్ణాటకలో డీకే శకం మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పటికీ, అధిష్ఠానం మొదట సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వడంతో ఆయన డిప్యూటీ సీఎంగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం మూడేళ్ల తర్వాత సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. “రాష్ట్రానికి కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తోంది నేను కాదు, ఒక సామాన్య కార్యకర్త” అని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఎన్నో ఆటుపోట్లు, రిస్కులతో కూడుకున్నది. 1962 మే 15న కనకపురలో జన్మించిన ఆయన, తన 18వ ఏటనే కాంగ్రెస్ విద్యార్థి విభాగం (NSUI) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో తన 23వ ఏట సాతనూరు నియోజకవర్గం నుంచి ఏకంగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడపైనే పోటీ చేసి ధైర్యం చాటారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి, కేవలం 27 ఏళ్ల వయసులోనే ఎస్. బంగారప్ప కేబినెట్‌లో మంత్రి అయ్యారు. వరుసగా 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, కర్ణాటకలోని శక్తివంతమైన ‘వొక్కలిగ’ సామాజిక వర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.

అధికారంతో పాటు ఆయన ఎన్నో చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. గ్రానైట్ అక్రమ తవ్వకాల ఆరోపణలు, ఆదాయపు పన్ను శాఖ (IT) దాడులు, సీబీఐ కేసులు ఆయనను చుట్టుముట్టాయి. ముఖ్యంగా 2019లో మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్ట్ చేయడంతో 50 రోజుల పాటు తీహార్ జైలులో గడపాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కేపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన, 2023 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ‘పేసీఎం’ లాంటి వినూత్న ప్రచారాలతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్ని విచారణలు ఎదుర్కొని జైలుకు వెళ్లినా పట్టు సడలని ధీరుడిగా నిలిచి, నేడు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు