“నీకేమైనా పిచ్చా? నేనే గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తీవ్ర పదజాలంతో హెచ్చరించినట్లు వస్తున్న వార్తలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎట్టకేలకు నోరు విప్పారు. పశ్చిమాసియా వ్యూహాత్మక దౌత్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడిందనే అంతర్జాతీయ నివేదికలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ట్రంప్ చేసిన విమర్శలను ఆయన చాలా తేలికగా తీసుకుంటూ.. అత్యుత్తమ కుటుంబాల్లో కూడా ఇలాంటి చిన్నపాటి తాత్కాలిక విభేదాలు, గొడవలు రావడం సర్వసాధారణమని కూల్గా రియాక్ట్ అయ్యారు.
ఇరాన్తో అమెరికా జరుపుతున్న దౌత్యపరమైన చర్చలను కాపాడేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఈ ఫోన్ కాల్ జరిగినట్లు తెలుస్తోంది. లెబనాన్, బీరూట్లలో ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ ఇరాన్ చర్చల నుంచి తప్పుకోవడంతో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ట్రంప్ ఈ విషయాన్ని కాస్త సున్నితంగా మారుస్తూ.. తాను నెతన్యాహుపై కోపంగా లేనని, చర్చలు జరుగుతున్న సమయంలో దాడులు కొనసాగించడం వల్ల కేవలం “కొద్దిగా కలత చెందాను” అని సర్దిచెప్పారు. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ.. “ఉదయం పూట మా మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా.. మధ్యాహ్నానికి ఇద్దరం ఒకే తాటిపైకి వస్తాం” అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఇరాన్ అణు ముప్పు అంశాన్ని నెతన్యాహు ప్రధానంగా ప్రస్తావించారు. టెహ్రాన్ అణుబాంబును తయారు చేయకుండా నిరోధించడంలో అమెరికా, ఇజ్రాయెల్లు ఒకే వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. ట్రంప్ను ఇజ్రాయెల్కు లభించిన “అత్యంత గొప్ప స్నేహితుడు” గా అభివర్ణించిన నెతన్యాహు.. తాను ప్రతి రెండు రోజులకు ఒకసారి ట్రంప్తో మాట్లాడుతుంటానని వెల్లడించారు. ఎంతటి సన్నిహిత మిత్రులైనా అన్ని విషయాల్లో ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదని, తాము మంచి స్నేహితులం కాబట్టి ఎల్లప్పుడూ సమస్యలను పరిష్కరించుకుంటామని చెబుతూ ఇరు దేశాల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలకు చెక్ పెట్టారు.









