గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెరపైనే కాదు, వంటింట్లో కూడా తన ప్రతిభను చాటుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన వండే బిర్యానీ, నాటు కోడి కూర గురించి ఇప్పటికే టాలీవుడ్లో పెద్ద టాక్ ఉండగా, తాజాగా తారక్ మొదటిసారి సొంతంగా కుకీస్ బేక్ చేశారు. తాను స్వయంగా చేసిన కుకీస్ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ ఫొటో చూసిన సాయి తేజ అనే అభిమాని.. “అన్నా, మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాకు కూడా రెండు కుకీస్ పంపిస్తావా?” అని సరదాగా కామెంట్ చేశాడు. దీనికి ఎన్టీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ‘కింగ్’ సినిమాలోని బ్రహ్మానందం పాపులర్ మీమ్ డైలాగ్తో “అడ్రస్ పెట్టు.. ఫాస్ట్ గా అడ్రస్ పెట్టు” అంటూ రీట్వీట్ చేశారు. తారక్ నుండి ఊహించని రిప్లై రావడంతో సంతోషంతో ఆ అభిమాని కళ్లలో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయ్యాడు. అయితే తారక్ కేవలం రిప్లైతోనే ఆగిపోకుండా, అన్న మాట ప్రకారం ఆ అభిమాని అడ్రస్కు నిజంగానే కుకీస్ పంపించి తన పెద్ద మనసును చాటుకున్నారు.
ఇదే క్రమంలో మరో నెటిజన్.. “బిర్యానీ, చికెన్ వండే టైగర్ ఇప్పుడు కుకీస్ కూడా చేస్తున్నారా?” అని సరదాగా ప్రశ్నించగా, దానికి కూడా తారక్ అంతే ఫన్నీగా మరో బ్రహ్మానందం మీమ్ డైలాగ్ “మారాయ్.. అన్నీ మారాయ్!” అంటూ రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్తో తారక్ చేసిన ఈ సరదా, ఆత్మీయ సంభాషణలు మరియు ఆయన టైమింగ్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి.









