అనకాపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరు: పరిశ్రమల రాకతో భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఇండస్ట్రియల్ హబ్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు బెల్లం, చెరకు, మామిడి పంటలకు ప్రసిద్ధి చెందిన అనకాపల్లి జిల్లాకు ఇప్పుడు ప్రముఖ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఆర్సెలార్ మిట్టల్, వారీ ఎనర్జీస్, లారస్ ల్యాబ్స్, బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్, లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ ఏర్పాటవుతుండటంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. గతంలో ఎకరం భూమి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ. కోటి వరకు పలుకుతుండటం విశేషం.

ముఖ్యంగా నక్కపల్లి ప్రాంతంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడం, దానికి తోడు నక్కపల్లి కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడటంతో ఆ పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. విశాఖపట్నం తర్వాత స్థిరాస్థి వ్యాపారులు, పెట్టుబడిదారులు అందరూ అనకాపల్లి జిల్లా వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని పరవాడ, అచ్యుతాపురం మండలాల్లో అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా.. ఎస్ రాయవరం, నక్కపల్లి, యలమంచిలి, పాయకరావుపేట మండలాల్లో సైతం ప్లాట్ల కొనుగోలుపై వ్యాపారులు భారీగా ఫోకస్ పెట్టారు. పరిశ్రమల స్థాపన కారణంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

మెగా స్టీల్ సిటీగా అనకాపల్లి.. మౌలిక సదుపాయాల కల్పనతో మరింత బూస్ట్

అనకాపల్లి జిల్లా అభివృద్ధికి ఇక్కడి రోడ్డు, రవాణా అనుసంధానత మరింత ప్లస్ పాయింట్‌గా మారింది. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు నిర్మిస్తున్న సెమీ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నరలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. దీనికి తోడు తుని, పాయకరావుపేట సమీపంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జాతీయ రహదారి వెంట ఇప్పటికే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలుకావడంతో పాటు విశాఖ డివిజన్ పరిధిలోని అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు.

విశాఖపట్నానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి.. రాబోయే రోజుల్లో వైజాగ్ జంట నగరంగా (Twin Cities) రూపాంతరం చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉపాధి కోసం విశాఖపట్నం వలస వెళ్లిన ఈ ప్రాంత యువతకు, ఇప్పుడు స్థానికంగానే భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అనకాపల్లి ‘మెగా స్టీల్ సిటీ’గా మారుతుందని, రాబోయే రోజుల్లో ఇక్కడ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థిరాస్థి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు