ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని ప్రాంతం మొత్తాన్ని 9 జోన్లుగా విభజిస్తూ ఏపీ సీఆర్డీఏ (APCRDA) కొత్త కమిషనర్ విజయరామరాజు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నాలుగు గ్రామాలను ఒక గ్రిడ్ లేదా జోన్గా ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. సీఆర్డీఏలోని ల్యాండ్ పూలింగ్ యూనిట్ల విభజనకు సంబంధించి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ (CCLA), గ్రామ వార్డు సచివాలయ విభాగాలకు ప్రభుత్వం నుండి అధికారిక అనుమతులు లభించాయి.
కొత్తగా ఏర్పాటు చేసిన జోన్ల వివరాల ప్రకారం.. ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్న కొండమరాజుపాలెం రెవెన్యూ ప్రాంతాన్ని సెంట్రల్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. కృష్ణాయపాలెం, పెనుమాక గ్రామాలను ఈస్ట్ జోన్ పరిధిలోకి.. ఐనవోలును ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి చేర్చారు. లింగాయపాలెం, ఉండవల్లి, వెంకటపాలెం గ్రామాలను నార్త్ ఈస్ట్ జోన్ పరిధిలోకి.. మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, మందడం (రెండు యూనిట్లు) ప్రాంతాలను నార్త్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి చేర్చారు. అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు గ్రామాలను నార్త్ వెస్ట్ జోన్ పరిధిలోకి.. నవులూరు (1, 2 యూనిట్లు) ప్రాంతాన్ని సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోకి.. కురగల్లు (రెండు యూనిట్లు), నిడమర్రు (రెండు యూనిట్లు) ప్రాంతాలను సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు (రెండు యూనిట్లు), అనంతవరం గ్రామాలను వెస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి చేర్చారు.
క్షేత్రస్థాయిలోనే భూసమస్యల పరిష్కారం: సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు
రెండో దశలో భాగంగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా ఏర్పాటు చేయడంతో పాటు నిర్ధేశిత సిబ్బందిని నియమించారు. ఒక్కో యూనిట్కు ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో, లైసెన్స్డ్ సర్వేయర్, విలేజ్ సర్వేయర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డిజిటల్ అసిస్టెంట్లను కేటాయించారు. భూమి విస్తీర్ణం ఆధారంగా కొన్ని గ్రామాల్లో అదనపు సర్వేయర్లను కూడా నియమించారు. ఇవి కాకుండా రాజధాని నగరంలో ‘ల్యాండ్స్ విభాగానికి’ మరియు ‘క్యాపిటల్ రీజియన్’ కోసం వేర్వేరు ప్రత్యేక ల్యాండ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎల్పీఎస్ (LPS) కోఆర్డినేషన్, గుంటూరు కలెక్టరేట్లో ప్రత్యేక అడ్మిన్ కార్యాలయం, నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ, ఆర్1 పరిధిలోని వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగాలను నియమించారు.
ఇప్పటివరకు గ్రామాల్లో కాంపిటెంట్ అథారిటీలే అన్ని వ్యవహారాలు చూసేవారు. కానీ ఇకపై జోనల్ స్థాయిలో ఉండే ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ఆయా జోన్ల పరిధిలోకి వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాల్సి ఉంటుంది. దీనివల్ల భూయజమానులు మరియు రైతులు చిన్న చిన్న సమస్యల కోసం నేరుగా విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి రానవసరం లేకుండా, తమ పరిధిలోని జోనల్ కార్యాలయాల్లోనే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని కమిషనర్ విజయరామరాజు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.









