తమిళనాడు అధికార వర్గాల్లో ఒకే రోజు 34 మంది ఐఏఎస్ అధికారులు మద్రాస్ హైకోర్టుకు హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూన్ 5వ తేదీన వివిధ జిల్లాల కలెక్టర్లు, పలు ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సివిల్ సర్వీసెస్ కోర్టు ధిక్కరణ ఆరోపణల కేసుల్లో న్యాయమూర్తుల ఎదుట హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నతాధికారులు ఒకే రోజు న్యాయస్థానానికి రావడం భారత దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని హైకోర్టు న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే బదిలీ అయి, ఇంకా కొత్త బాధ్యతలు కూడా తీసుకోని ఒక మహిళా కలెక్టర్ సైతం విమానంలో వచ్చి కోర్టుకు హాజరుకావడం గమనార్హం.
ఈ పరిణామంపై అధికార వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విలువైన సమయం కలిగిన అఖిల భారత సర్వీసుల అధికారులు ఇలా రోజంతా కోర్టులోనే వేచి ఉండాల్సి రావడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో కీలకమైన పని గంటలు వృథా అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణలు కోరిన తర్వాత మాత్రమే ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కోర్టుల్లో ‘హైబ్రిడ్ విధానం’ అందుబాటులో ఉన్నందున, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వీరి హాజరును నమోదు చేసే అవకాశం ఉన్నా వ్యక్తిగతంగా పిలిపించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వాస్తవానికి ప్రభుత్వ అధికారులు కోర్టు విచారణలకు హాజరయ్యే విషయమై 2024లోనే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపకల్పన చేసింది. సమాచారాన్ని దాచడం లేదా తప్పుగా చూపడం వంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే అధికారులను వ్యక్తిగతంగా పిలిపించాలని, మొదటి ప్రాధాన్యతగా వీడియో కాన్ఫరెన్సింగ్ను ఎంచుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే తమిళనాడులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ సైతం అధికారులు ఎటువంటి ఉదాసీనతకు తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసిన తరుణంలో.. ఈ కోర్టు ధిక్కరణ కేసులు మరియు అధికారుల మూకుమ్మడి హాజరు ప్రాధాన్యతను సంతరించుకుంది.









