అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 15 కోట్లకు పైగా భక్తులు రామ్లల్లాను దర్శించుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ కాలంలోనే భక్తుల నుండి రికార్డు స్థాయిలో రూ.500 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్ పేర్కొంది. ప్రస్తుతం రోజుకు సగటున రూ.8 లక్షల నుండి రూ.10 లక్షల వరకు కానుకలు వస్తుండగా, ఈ నిధుల లెక్కింపు, భద్రత బాధ్యతలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్యవేక్షిస్తోంది.
అయితే, ఈ విరాళాల నిధుల వినియోగం మరియు లెక్కింపుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ, ఆరోపణలు మొదలయ్యాయి. రామమందిరానికి వచ్చిన కానుకల్లో భారీగా నిధులు గల్లంతయ్యాయంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేస్తూ న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను నిష్పక్షపాతంగా తేల్చేందుకు కేంద్రీయ దర్యాప్తు సంస్థలచే (CBI లేదా ED) స్వతంత్ర విచారణ జరిపించాలని సీనియర్ బీజేపీ నాయకుడు, అధికార ప్రతినిధి డాక్టర్ రజ్నీశ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర అత్యవసరంగా అయోధ్యకు చేరుకుని ట్రస్ట్ సభ్యులు, ఎస్బీఐ ప్రతినిధులతో సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే విపక్షాల ఆరోపణలను ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తోసిపుచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సుమారు నాలుగు డజన్ల విరాళాల పెట్టెల నుండి ప్రతిరోజూ నగదు సేకరిస్తామని, సీసీటీవీల నిఘా నీడలోనే ఎస్బీఐ పర్యవేక్షణలో అంతర్గత ఆడిటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని, ఎక్కడా నిధుల అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.









