శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీలో మరోసారి చీలిక రాబోతోందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న ఊహాగానాలపై ఆ పార్టీ వర్కింగ్ లీడర్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారాలని చూస్తున్న అసమ్మతి నేతలకు ఆయన నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ధైర్యముంటే ముందుగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆ తర్వాతే పార్టీని వీడాలని స్పష్టం చేశారు. ఈ రకమైన వెన్నుపోటు రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం సహించరని ఆయన హెచ్చరించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్టీ అగ్రనేతలు, ఎంపీలైన అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావు వాజేలతో కలిసి సంజయ్ రౌత్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తిందంటూ వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీ గుర్తుపై గెలిచి, ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం గోడ దూకాలని చూసే వారిని తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
ప్రస్తుతం చట్టసభల్లో ఉన్న శివసేన (యూబీటీ) ఎంపీల విజయం వెనుక పార్టీ నాయకత్వ శ్రమ ఎంతో ఉందని సంజయ్ రౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రేతో పాటు తామంతా రక్తం, చెమట చిందించి, రాత్రింబగళ్లు కష్టపడి, నిధులు ఖర్చు చేసి వీరిని ఎన్నికల్లో గెలిపించామని గుర్తు చేశారు. ఇంత చేసినా ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ విశ్వాసఘాతకానికి పాల్పడితే, మహారాష్ట్ర జనం ఈసారి వీధుల్లోకి వచ్చి బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.








