బంగ్లాదేశ్లో జులై 2024న షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, దాయాది పాకిస్థాన్ ఆ దేశానికి వ్యూహాత్మకంగా దగ్గరవుతోంది. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత సైనిక శక్తి ముందు మోకరిల్లిన పాకిస్థాన్, ఆ తర్వాత బంగాళాఖాతంలోకి అడుగుపెట్టే సాహసం చేయలేదు. అయితే, మళ్లీ ఐదున్నర దశాబ్దాల తర్వాత చైనా రక్షణ సహకారంతో బంగాళాఖాతంలో తన నౌకాదళాన్ని విస్తరించేందుకు పాక్ కుట్రలు చేస్తోంది. చైనా నుంచి కొనుగోలు చేస్తున్న ఎనిమిది అధునాతన ‘హంగోర్ శ్రేణి’ జలాంతర్గాములలో మొదటి సబ్మెరైన్ స్వదేశానికి వస్తున్న తరుణంలో, పాక్ ఫ్లోటిల్లా నౌక కమాండర్ కమోడోర్ ఒమర్ ఫరూఖీ శ్రీలంకలో చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఈ సరికొత్త ‘హంగోర్’ జలాంతర్గాములు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) టెక్నాలజీతో రూపొందడం వల్ల ఇవి సాధారణ డీజిల్-ఎలక్ట్రికల్ సబ్మెరైన్ల కంటే ఎక్కువ కాలం నీటిలోనే ఉండి శత్రువుల కంటికి చిక్కకుండా ప్రయాణించగలవు. ఈ సామర్థ్యంతో తమ సైనిక శక్తిని అరేబియా సముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోనూ విస్తరిస్తామని, ఇవి తమకు గేమ్చేంజర్గా మారబోతున్నాయని పాక్ అధికారి పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకమైన విశాఖపట్నంలోని తూర్పు నావెల్ కమాండ్, భారత అణు జలాంతర్గాముల తయారీ కేంద్రం మరియు ‘ఐఎన్ఎస్ వర్ష’ బేస్ ఉన్న బంగాళాఖాతంలో పాక్ సబ్మెరైన్ల సంచార ప్రణాళికలు భారత రక్షణ నిపుణులను అప్రమత్తం చేస్తున్నాయి.
భారత నౌకాదళ సామర్థ్యంతో పోలిస్తే పాకిస్థాన్ నేవీ చాలా బలహీనమైనది. శక్తిమంతమైన విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు భారత్ సొంతం కాగా, పాక్ మాత్రం చైనా, తుర్కియేల సరఫరాలపైనే ఆధారపడుతోంది. అయినప్పటికీ, ఇటీవల పాకిస్థాన్, బంగ్లాదేశ్ల మధ్య నేరుగా సముద్ర వాణిజ్యం ప్రారంభం కావడం, గతేడాది నవంబరులో పాక్ యుద్ధనౌక ‘పీఎన్ఎస్ సైఫ్’ బంగ్లాదేశ్లోని ఛట్టోగ్రామ్ తీరంలో మోహరించడం గమనార్హం. గతంలో 1971 యుద్ధ సమయంలో పాక్ జలాంతర్గామి ఘాజీని విశాఖ తీరంలోనే భారత్ జలసమాధి చేయగా, ప్రస్తుత అంతర్జాతీయ అంతర్జాతీయ జలాల నిబంధనలను ఆసరాగా చేసుకుని బంగాళాఖాతంలో పాక్ జరిపే మోహరింపులు భవిష్యత్తులో భారత్కు భద్రతాపరమైన ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









