స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను ‘ట్రాలాలా పిక్చర్స్’ బ్యానర్పై సమంత స్వయంగా నిర్మించారు. జూన్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ హోరెత్తిస్తోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్ స్టార్డమ్పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో హీరోల ఎలివేషన్స్ మరియు బాక్సాఫీస్ స్టామినా గురించి సమంత మాట్లాడుతూ ప్రభాస్ ఉదాహరణను అద్భుతంగా వివరించారు. “ప్రస్తుతం ప్రభాస్ గారి చేయి పడితే చాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వస్తాయి. కానీ ఆయన తన మొదటి సినిమాకే ఆ స్థాయిని అందుకోలేదు. దాదాపు పదేళ్ల పాటు ఎంతోమంది దర్శకులు ఆయనను ఎలివేట్ చేసే కథలు రాసి, ఆ రేంజ్ స్టార్డమ్కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన స్క్రీన్పై కేవలం చేయి వేసినా థియేటర్లలో జనాలు ఊగిపోతారు” అని సమంత పేర్కొన్నారు. తాను నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాలో అలాంటి భారీ ‘చేయి పడే’ మాస్ షాట్స్ పెట్టలేదని, మహిళా పాత్రలకు మొదటి సినిమాకే అలాంటి బిల్డప్ షాట్స్ పెడితే జనాలు ఒప్పుకోరని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.
మహిళా ప్రాధాన్యత (ఉమెన్ సెంట్రిక్) చిత్రాలపై సమాజంలో ఉన్న అంచనాలపై సమంత ఘాటుగా స్పందించారు. “లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే కేవలం సోషల్ మెసేజ్ ఉండాలి, అమ్మాయి ఒక దేవతలా త్యాగాలు చేయాలి అని ఒక బ్రాకెట్ గీసేశారు. దాన్ని బ్రేక్ చేయాలనేదే నా తపన. మహిళలతో కూడా ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయగలుగుతామని నిరూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం” అని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై దర్శకురాలు నందినీ రెడ్డి స్పందిస్తూ.. టాలీవుడ్లో లేడీ అమితాబ్ విజయశాంతి అప్పట్లోనే అలాంటి పవర్ఫుల్ మాస్ సినిమాలు చేశారని, హాలీవుడ్లో ‘చార్లెస్ ఏంజెల్స్’ లాంటి చిత్రాలను ఆదరిస్తున్నట్లే తెలుగులోనూ రాబోయే రోజుల్లో ఆ మార్పు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.









