తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమై, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘చిత్రం’ శ్రీను (శ్రీనివాసులు) తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేణు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’ షూటింగ్ ముగించుకున్న సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కెరీర్ ఆరంభంలో వచ్చిన విపరీతమైన క్రేజ్ వల్ల తనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందని, ఆ సమయంలో చేసిన తప్పుల వల్లే ఆర్థికంగా వెనుకబడ్డానని ఆయన ఓపెన్గా అంగీకరించారు.
అప్పట్లో తనకు వచ్చిన రెమ్యునరేషన్, సినిమా అవకాశాల గురించి శ్రీను గుర్తుచేసుకుంటూ.. “నేను ఎప్పుడూ డబ్బును డబ్బుగా చూడలేదు. వచ్చిన డబ్బునంతా స్నేహితులకు, పార్టీలకే విపరీతంగా ఖర్చు చేశాను. ఆ రోజుల్లో నేను రోజుకు నాలుగైదు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడిని. అప్పుడు గనుక నేను బుద్ధిగా డబ్బు పొదుపు చేసుంటే.. ఈ రోజు హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో సగం ఆస్తులు నావే అయి ఉండేవి. అవకాశాలు, డబ్బు ఎప్పుడూ ఇలాగే వస్తూనే ఉంటాయని భ్రమపడ్డాను. కానీ సినిమా రంగంలో ఎప్పుడూ ఒకేలా ఉండదనే సత్యాన్ని తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చాలా మంచి ఆర్టిస్ట్ని అని, ఎప్పటికీ బిజీగా ఉంటాననే గర్వంతో జూబ్లీహిల్స్లో ఇల్లు కొనాలనే ఓవర్ కాన్ఫిడెన్స్తో బతికేవాడినని శ్రీను చెప్పారు. అయితే ఆ తర్వాత సినిమాలు తగ్గినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడ్డానని, ఆ కష్టకాలంలో స్టేజ్ ఈవెంట్స్, తన స్నేహితులే నన్ను ఆదుకున్నారని కృతజ్ఞత భావం చాటారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా ప్రతి ఒక్కరికీ ముందుచూపుతో పాటు క్రమశిక్షణ చాలా అవసరమనే బలమైన పాఠాన్ని తాను నేర్చుకున్నానని చిత్రం శ్రీను ఈ సందర్భంగా వెల్లడించారు.








