ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కూటమి సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పొదుపు సంఘాల మహిళలకు సకాలంలో రుణాలు అందించి ప్రోత్సహిస్తే.. వారు ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా వివిధ ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాణించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపుల (డ్వాక్రా) రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ. 3 లక్షల నుండి ఏకంగా రూ. 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ కీలకమైన హామీని విస్మరించడం వల్ల మహిళలు ఏటా రూ. 3 వేల కోట్ల చొప్పున గడిచిన రెండేళ్ల కాలంలో మొత్తం రూ. 6 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత వైసీపీ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద రూ. 4,969 కోట్లు నేరుగా చెల్లించామని, దాంతో పాటు ‘ఆసరా’, ‘చేయూత’ వంటి వినూత్న పథకాల ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేసి ఆర్థికంగా అండగా నిలిచామని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం కొత్తగా పెంచుతామన్న రుణ పరిమితి సంగతి అటుంచితే, ప్రస్తుతం అమలులో ఉన్న సాధారణ వడ్డీ రాయితీ పథకానికి కూడా నిధులు కేటాయించకుండా, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.









