రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత ప్రస్థానం దేశంలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా గిరిజన యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఒడిశాలోని ఒక చిన్న గిరిజన గ్రామంలో పుట్టి, అనేక అవరోధాలను దాటుకుంటూ తన గ్రామం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి మహిళగా నిలిచిన ఆమె ప్రస్థానం అసాధారణమైనదని కొనియాడారు. కౌన్సిలర్ స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరురాలిగా ఆమె అంచెలంచెలుగా ఎదిగిన తీరు సంవత్సరాల ప్రజా సేవకు నిదర్శనమని పేర్కొన్నారు.
తన జీవితంలో ఎదురైన తీవ్ర వ్యక్తిగత విషాదాలను తట్టుకుని నిలబడిన రాష్ట్రపతి ధీరత్వాన్ని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఐదేళ్ల వ్యవధిలోనే ఇద్దరు కుమారులు, భర్త, తల్లి, సోదరుడిని కోల్పోయి ఊహించని దుఃఖాన్ని అనుభవించినప్పటికీ.. ఆమె నిరాశకు లోంగిపోకుండా ఆధ్యాత్మికతతో ఆ బాధను ఇతరుల పట్ల కరుణగా మార్చుకున్నారని తెలిపారు. “పేదలు కలలు కనడమే కాదు, వాటిని నిజం చేసుకోగలరనడానికి నా ఎన్నికలే నిదర్శనం” అని ఆమె రాష్ట్రపతిగా ప్రమాణం చేసినప్పుడు చెప్పిన మాటలు, అడ్డంకులను ఎదుర్కొని జీవించిన ఆమె జీవిత సారాన్ని తెలియజేస్తున్నాయని లోకేశ్ భావోద్వేగంతో వివరించారు.
ప్రధాని మోదీ స్ఫూర్తితో, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా వ్యవస్థను ఉపాధి, పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణల వైపు నడిపిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేవలం డిగ్రీలతో విజయాన్ని కొలవకుండా, సమాజంలో సృష్టించే మార్పుతోనే దాన్ని గుర్తించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువతలో కొందరు రాజకీయాల్లోకి వచ్చి దేశ రాజకీయ గమనాన్ని మార్చాలని ఆకాంక్షించారు. ఈ విశిష్ట కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.









