ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగం అనూహ్యంగా విస్తరిస్తున్న తరుణంలో దానికి అతిపెద్ద అడ్డంకి అత్యాధునిక కంప్యూటర్ చిప్స్ కాదని, విద్యుత్ సరఫరా అని ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్రాక్ చైర్మన్, సీఈఓ లారీ ఫ్రింక్ స్పష్టం చేశారు. అమెరికా తన పాతకాలపు విద్యుత్ గ్రిడ్ను ఆధునికీకరించడంలో విఫలమైతే, తదుపరి టెక్నాలజీ విప్లవం మందగించే ప్రమాదం ఉందని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు.
సీఎన్ఎన్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో లారీ ఫ్రింక్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వేగంగా విస్తరించడం వల్ల కంప్యూటింగ్ పవర్కు భారీ డిమాండ్ ఏర్పడుతోందని, ఇది అమెరికా విద్యుత్ మౌలిక సదుపాయాల బలహీనతలను బయటపెడుతోందని ఆయన వివరించారు.
“అమెరికాలో మనకు తగినంత విద్యుత్ లేదు. ఏఐ అభివృద్ధికి ప్రస్తుతం ఇదే అతిపెద్ద అవరోధం” అని ఆయన అన్నారు. అమెరికా వద్ద సహజవాయువు రూపంలో అపారమైన ఇంధన వనరులు ఉన్నప్పటికీ, దానిని దేశవ్యాప్తంగా సమర్థవంతంగా పంపిణీ చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన సమస్య అని ఆయన పేర్కొన్నారు.
“మన విద్యుత్ గ్రిడ్ను విస్తరించి, అప్గ్రేడ్ చేయడానికి వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మనం అలా చేయకపోతే, ఏఐలో విజయం సాధించలేం. ఏఐ అంటే కొన్ని ఎలక్ట్రాన్ల సమూహం మాత్రమే. ఆ ఎలక్ట్రాన్లను సృష్టించాలంటే విద్యుత్ అత్యవసరం” అని ఫ్రింక్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యానికి ఉన్న డిమాండ్కు తగినంత సరఫరా లేదని, దీనివల్ల చిప్స్తో పాటు విద్యుత్, ఇతర కీలక మౌలిక సదుపాయాల కొరత కూడా ఏర్పడుతోందని ఆయన తెలిపారు.
ఏఐ ప్రయోజనాలు కేవలం పెద్ద సంస్థలకే పరిమితం కాకూడదని లారీ ఫ్రింక్ అభిప్రాయపడ్డారు. “బ్లాక్రాక్ లేదా జేపీ మోర్గాన్ వంటి పెద్ద కంపెనీలు ఈ మోడళ్లలో పెట్టుబడులు పెట్టడం గురించి నాకు చింత లేదు. కానీ, ఆసుపత్రులు, స్థానిక ప్రభుత్వాలు, రవాణా వ్యవస్థలు, చిన్న వ్యాపారాలు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోగలవా అనేదే నా ఆందోళన” అని ఆయన అన్నారు. అమెరికా ‘ఏఐని ప్రజాస్వామ్యీకరించాలి’ అని పిలుపునిచ్చారు. అలా చేయకపోతే దేశంలో తీవ్రమైన నిర్మాణాగత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
ఏఐ రంగంలో భారీ పెట్టుబడుల కారణంగా ఈక్విటీ మార్కెట్లు స్పెక్యులేటివ్ బబుల్లో ఉన్నాయన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. అసాధారణంగా పెరిగిన డిమాండ్ వల్లే కొరత ఏర్పడిందని, దానివల్ల కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులకు అధిక ధరలు నిర్ణయించగలుగుతున్నాయని వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ అప్పులను అధిగమించేందుకు సుస్థిర ఆర్థిక వృద్ధే సరైన మార్గమని ఫ్రింక్ సూచించారు. ఏడాదికి 3 శాతం చొప్పున ఆర్థిక వృద్ధిని సాధించలేకపోతే మనం కష్టాల్లో పడతామని, పన్నులు పెంచడం కన్నా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.









