అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైనిక బలగాలు అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ సైనిక గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహాన్షాహీ హెచ్చరించారు. అమెరికా సైనికులు ఇరాన్ గడ్డపై అడుగుపెడితే వారిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై నేరుగా సైనిక దాడి కంటే ఆర్థిక ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థిక ఆంక్షలు, ఒత్తిళ్ల ద్వారా ఇరాన్ను చర్చలకు తీసుకురావాలనే లక్ష్యంతో అమెరికా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది.
ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ వైఖరి కూడా కఠినంగానే ఉంది. తమ షరతులు నెరవేరితేనే అమెరికాతో చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి వస్తున్న ప్రకటనలకు ఇరాన్ నేతలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తుండటంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమవుతుందా లేదా అనే అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.









