భారత్-నేపాల్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 210 ఏళ్ల నాటి సుగౌలి ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు తమ వద్ద ఉన్నాయో లేదో ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నామని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. 1816లో బ్రిటిష్ ఇండియా, నేపాల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఇరు దేశాల సరిహద్దులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించింది.
నేపాల్ పార్లమెంటరీ విచారణ కమిటీ ఆర్కైవ్స్, ప్రభుత్వ శాఖలు, మ్యూజియంలలో అన్వేషించినప్పటికీ సుగౌలి ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు గుర్తించలేకపోయినట్లు విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పార్లమెంట్లో తెలిపారు. నేషనల్ ఆర్కైవ్స్లో కొన్ని ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ, అవే అసలు అధికారిక పత్రాలో కాదో నిర్ధారించలేకపోయామని చెప్పారు.
అసలు సుగౌలి ఒప్పంద పత్రాలతో పాటు 1950 భారత్-నేపాల్ శాంతి, స్నేహ ఒప్పందానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయనే అంశం నేపాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో అప్పటి నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ వద్ద ఈ రెండు ఒప్పందాలకు సంబంధించిన కాపీలు ఉన్నాయని అప్పట్లో ఆయన వెల్లడించారు.









