ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత తూమాటి మాధవరావు మంగళవారం తమ నామినేషన్ పత్రాలను అధికారికంగా సమర్పించారు. ఈ ఎన్నికకు సంబంధించి పార్టీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తూమాటి మాధవరావు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాధవరావును వైఎస్ జగన్ అభినందించారు.
మండలిలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా సమన్వయంతో పనిచేసి ఎన్నిక ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం శాసనమండలిలో పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ ఎన్నిక ప్రక్రియ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.









