గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగుచూసిన రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ (Boss Scam) కేసు దర్యాప్తులో విస్తుపోయే అంతర్జాతీయ లింకులు బయటపడ్డాయి. భారత్, చైనా, పాకిస్థాన్ దేశాల కేంద్రంగా సాగుతున్న భారీ అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. సీనియర్ అధికారి పేరుతో వాట్సాప్ సందేశం పంపి ఉద్యోగిని బురిడీ కొట్టించిన ఈ కేసులో, సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే స్పందించి రూ.1.3 కోట్లను రికవరీ చేయడంతో పాటు పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి ఏకంగా 4,500 నకిలీ సిమ్ కార్డులు, మల్టీ-సిమ్ బాక్స్ పరికరాలు, మొబైల్ ఫోన్లు మరియు రూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా వివిధ ఆన్లైన్ గేమింగ్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల కోసం సుమారు 21,000 ఓటీపీలను (OTPs) సరఫరా చేసి లక్షలాది రూపాయలు ఆర్జించినట్లు వెల్లడైంది. ఈ సిమ్ కార్డుల డేటాను పరిశీలించగా, దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో నమోదైన 251 సైబర్ నేరాల ఫిర్యాదులతో వీటికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ దర్యాప్తులో చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు రూపొందించిన ప్రమాదకరమైన మాల్వేర్ను ఉపయోగించినట్లు, అలాగే ఇస్లామాబాద్లోని కాల్ సెంటర్ నెట్వర్క్ సహకారంతో ఈ మోసాలు సాగినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. గత నాలుగైదేళ్లుగా చైనా, పాకిస్థాన్లలోని ముఠాలకు డమ్మీ సిమ్లు, ఓటీపీలు, వర్చువల్ వాట్సాప్ ఖాతాల రూపంలో ‘సైబర్క్రైమ్ యాజ్ ఎ సర్వీస్’ (CaaS) అందిస్తున్నారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన ఈ భారీ సైబర్ రాకెట్పై దర్యాప్తు కొనసాగుతోంది.









