ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న డీజిల్ కొరత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా రిటైల్ బంకుల ద్వారా బల్క్గా డీజిల్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రిటైల్ బంకుల నుంచి బల్క్ సరఫరా చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.
గత మూడు రోజులుగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. స్టాక్ లేక చాలా బంకులు మూతపడగా, తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజధాని పనులకు ఇబ్బంది కలగకుండా డీజిల్ కోటాను పెంచాలని ఏపీ సీఎస్ ద్వారా కేంద్రానికి లేఖ రాయగా, రిటైల్ బంకుల్లో బల్క్ సరఫరాకు కేంద్రం ససేమిరా అనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడినట్లయింది.
కాగా, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా సుమారు రూ.150 కోట్ల డీజిల్ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించింది. బల్క్లో రూ.153 గా ఉన్న డీజిల్ను, రిటైల్ బంకుల్లో రూ.98కే ఇప్పిస్తూ కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించింది. రైతులకు, సామాన్యులకు ఇంధనం దొరకకుండా చేసి, రాష్ట్రంలో ఈ కృత్రిమ చమురు కొరతను చంద్రబాబు ప్రభుత్వమే సృష్టించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.









