బతుకమ్మ కుంటలో అసలు చెరువు లేదని బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంపై హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ ఘాటుగా స్పందించారు. సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం అక్కడ స్పష్టంగా పది ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని ఆయన వివరించారు. చెరువును పునరుద్ధరించే చర్యలను అడ్డుకునేందుకు సుధాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, కానీ ప్రభుత్వ రికార్డులు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ భూమికి తానే యజమానినని, గతంలో అక్కడ వ్యవసాయం కూడా చేశామని సుధాకర్ రెడ్డి చెబుతున్నారని రంగనాథ్ తెలిపారు. అయితే, అసలు చెరువు శిఖం భూమికి పట్టాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. చెరువును పూడ్చి వ్యవసాయం చేసినంత మాత్రాన ఆ భూమిపై ఎవరికీ యాజమాన్య హక్కులు రావని, చెరువు భూమి ఎప్పటికీ చెరువుదేనని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ చెరువు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరిస్తుందని కమిషనర్ వెల్లడించారు. అక్కడ నివసించే పేదలను ఖాళీ చేయించి, వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, ఆక్రమణలను తొలగించి చెరువును పూర్వస్థితికి తీసుకువస్తామని రంగనాథ్ ధీమా వ్యక్తం చేశారు.









