తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావం: జాగృతి వేరు.. టీఆర్ఎస్ వేరు అని స్పష్టం చేసిన కవిత

తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సాంస్కృతిక చైతన్యం కోసం పనిచేసిన తెలంగాణ జాగృతి ఇకపై కేవలం స్వచ్ఛంద సంస్థగా (NGO) మాత్రమే కొనసాగుతుందని, రాజకీయ పోరాటాల కోసం తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ పార్టీ ప్రధానంగా జెన్ జీ (GenZ) యువతను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆమె వెల్లడించారు.

ప్రజల గొంతుకగా నిలబడటమే తమ పార్టీ లక్ష్యమని, ఇందుకోసం పాంచజన్యం పేరుతో ఐదు ప్రధాన అంశాలతో కూడిన అజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నామని కవిత ప్రకటించారు. ఈ అజెండాలో భాగంగా పేదలకు ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్యం, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు 2 లక్షల నుండి 20 కోట్ల వరకు రుణాలు అందించడంతో పాటు, తెలంగాణ ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలను సృష్టిస్తామని పేర్కొన్నారు.

రాజకీయంగా తన తండ్రి కేసీఆర్ మరియు సోదరుడు కేటీఆర్‌లపై కూడా ఆమె ఘాటు విమర్శలు చేశారు. తండ్రిగా కేసీఆర్‌పై గౌరవం ఉన్నప్పటికీ, రాజకీయ నాయకుడిగా ఆయన వైఖరితో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని, గత పదేళ్ల పాలనలో నీటిపారుదల మరియు పేపర్ లీకేజీల వంటి అంశాల్లో వైఫల్యాలను ఎత్తిచూపారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన సిమ్ కార్డు ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా పనిచేస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు