నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా గంటల తరబడి వాహనాలను నిలిపివేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను వెళ్లే దారితో పాటు, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని డీజీపీ సీవీ ఆనంద్‌కు సూచించారు.

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడాన్ని ఆయన స్వయంగా గమనించారు. ప్రజల పనులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ వెంటనే రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక ప్రత్యేక ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఇకపై ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో రహదారిని పూర్తిగా మూసివేయకుండా, సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించేలా కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు