హస్కీ కుక్కలను వదిలేసిన కేసులో వీడిన మిస్టరీ.. నలుగురి అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైన సైబీరియన్ హస్కీ జాతి కుక్కలను నడిరోడ్డుపై వదిలేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను బీడీఎల్ భానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కుక్కల వయసు పెరగడం, వాటిని పెంచేందుకు అయ్యే భారీ ఖర్చును భరించలేకపోవడం వల్లే ఇలా రోడ్డుపై వదిలించుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు.

పటాన్‌చెరు మండలం నందిగామ శివారులో ఈ హస్కీ కుక్కలను గుర్తించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి కుక్కలను అక్కడికి తరలించిన ఆటో ట్రాలీని మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ సమీపంలో గుర్తించారు. దీని ఆధారంగా ఫతేనగర్‌కు చెందిన సత్యనారాయణ, సుధీర్ బాబు, సుందర్ సింగ్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎండ తీవ్రతను తట్టుకోలేక, సరైన ఆహారం దొరకకపోవడంతో ఇప్పటికే ఓ శునకం మృతి చెందడం బాధాకరం.

పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కుక్కలను హైదరాబాద్‌లోని హైదర్ నగర్ కల్వరి టెంపుల్‌లో పెంచినట్లు నిర్ధారించారు. వాటి సంరక్షణ భారం కావడంతోనే ఇలా నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.. అసలు కల్వరి టెంపుల్‌లో శునకాలను పెంచడానికి తగిన లైసెన్స్‌లు, అనుమతులు ఉన్నాయో లేదో తెలుపుతూ సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ అధికారులకు లేఖ రాశారు. పెంపుడు జంతువులను ఇలా అనాథలుగా వదిలేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు