బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్లా దోచుకోవడం, దాచుకోవడం లేదా వారిలా డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి హింసించారని ఆరోపిస్తూ, తమకు అలాంటి పనులు చేయడం తెలియదని మండిపడ్డారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడటం తమకు తెలియదని వ్యాఖ్యానించిన ఆయన, కేటీఆర్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అహంకారం వల్లనే కేసీఆర్ ఓడిపోయి ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని ఆయన విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోందని, ఆ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. తాము ఢిల్లీ నుంచి నిధులు తెస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి సొమ్మును తమ అధిష్ఠానానికి పంపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నడుపుకోవడానికి తెలంగాణ నిధులను వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పర్యటన కేవలం తెలంగాణ అభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు. వరుస ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నప్పటికీ కేటీఆర్లో మార్పు రావడం లేదని ఆయన విమర్శించారు. పారదర్శకమైన పాలనతోనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.









