మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో టాలీవుడ్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ వివాదం ముదిరింది. సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానానికి అంగీకరించిన సినిమాలనే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎగ్జిబిటర్ల ఈ ఏకపక్ష నిర్ణయంపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం మీడియా సమావేశం నిర్వహించింది.
చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారని, మూడు సెక్టార్లు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని నిర్మాత రవిశంకర్ యలమంచిలి సూచించారు. ఎగ్జిబిటర్ల కష్టాలను తాము అర్థం చేసుకుంటామని, అయితే పరిశ్రమలో ఉన్న ఎకో సిస్టమ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయంలో ఇలాంటి డిమాండ్లు చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీని ఇవ్వడం నిర్మాతలకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ‘పెద్ది’ వంటి భారీ సినిమా విడుదలకు ముందు ఇలా బ్లాక్మెయిల్ చేయడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యంగా లీజులో ఉన్న థియేటర్ల యజమానులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోతే ఈ ప్రభావం రాబోయే పెద్ద సినిమాల విడుదలపై పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.









