అమెరికా మరియు ఇతర విదేశాల్లోని వందలాది మంది వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, మిలియన్ల కొద్దీ డాలర్లను దోచుకుంటున్న భారతదేశానికి చెందిన ఒక భారీ కాల్ సెంటర్ నెట్వర్క్ను అమెరికా అధికారులు విజయవంతంగా మూసివేయించారు. ఈ అంతర్జాతీయ మోసానికి సంబంధించి బోస్టన్లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) సుదీర్ఘకాలం పాటు దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో టెలీమార్కెటింగ్ ద్వారా అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు నిందితుల నేరాలను ఎఫ్బీఐ ఆధారాలతో సహా నిరూపించింది.
ఈ కుంభకోణానికి అమెరికాలోని మయామీకి చెందిన ఆడమ్ యంగ్, లాస్ వెగాస్కు చెందిన హారిసన్ గెవిర్జ్ నడుపుతున్న ఒక టెలీకమ్యూనికేషన్స్ సంస్థ కీలకమైన సాంకేతిక సాయం అందించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ అందించే కాల్ రూటింగ్, టెలిఫోన్ నంబర్స్, కాల్ ఫార్వార్డింగ్ వంటి సేవలను ఉపయోగించుకుని భారతదేశంలోని మోసగాళ్లు అమెరికన్లకు గాలం వేసేవారు. తమ ప్లాట్ఫారమ్ ద్వారా ఇలాంటి భారీ మోసాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ, సదరు అమెరికన్ నిర్వాహకులు వారి కార్యకలాపాలను అలాగే కొనసాగనిచ్చారు.
దాదాపు ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లోతైన దర్యాప్తులో అమెరికా అధికారులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెట్వర్క్ వెనుక ప్రధానంగా ఐదుగురు భారతీయుల హస్తం ఉన్నట్లు తేలింది. వీరితో పాటు జగ్మీత్ సింగ్ విర్క్ అనే వ్యక్తి కూడా ఈ టెలీ మార్కెటింగ్ మోసాలలో కీలక పాత్ర పోషించినట్లు ఎఫ్బీఐ నిర్ధారించి, అతనిపై నేరాన్ని నిరూపించింది.









