బొద్దింకలు రోడ్డెక్కలేవన్నారు, ఇదిగో వచ్చేశాం: జంతర్ మంతర్‌లో అభిజిత్ దీప్కే

దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో నెలకొన్న పలు తీవ్ర సమస్యలపై యువత గళమెత్తింది. సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తొలిసారిగా భారీ ప్రత్యక్ష నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసనను ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. “బొద్దింకలు రోడ్డెక్కలేవని ఈగతాళి చేసిన వారికి సమాధానంగానే మేము ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చాం” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్, అలాగే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో దొర్లిన తీవ్ర అవకతవకలను నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దేశవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రముఖ సామాజిక విద్యా రంగ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతలో కొందరిని ఉద్దేశించి ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ అని చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య స్పందనగా ఈ సరికొత్త పార్టీ ఆవిర్భవించింది. బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన అభిజిత్ దీప్కే, యువత ఎదుర్కొంటున్న నిరాశను, నిరుద్యోగాన్ని ప్రతిబింబిస్తూ ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ఈ ఉద్యమం, ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటంగా రూపాంతరం చెందింది. కాగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వెయ్యి మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ముందుజాగ్రత్త చర్యగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు