చైనాలోని చాంగ్కింగ్ మునిసిపాలిటీకి చెందిన వాంగ్ (53) అనే మహిళకు, హే అనే వ్యక్తితో 1998లో వివాహమైంది. పెళ్లయిన కొన్నేళ్ల పాటు వీరి సంసారం బాగానే సాగినప్పటికీ, గత పదేళ్లుగా భర్త ఆమెను తీవ్రమైన శారీరక, మానసిక హింసకు గురిచేయడం ప్రారంభించాడు. భర్త చేసిన క్రూరమైన దాడుల వల్ల వాంగ్ పక్కటెముకలు విరిగిపోవడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నరకం చాలదన్నట్లు అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా ఆమె కనిపెట్టింది. దీనిపై నిలదీయగా, ఆ ప్రియురాలితో కలిసి వాంగ్ను చంపేస్తామని బెదిరింపులకు దిగారు.
ఇలాంటి దారుణమైన పరిస్థితుల మధ్య వాంగ్ తీవ్ర అనారోగ్యానికి గురై, చివరకు క్యాన్సర్ బారిన పడింది. మెడికల్ బిల్లులు కట్టలేక ఆమె ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తుంటే, కట్టుకున్న భర్త మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నాటకాలు ఆడాడు. దీంతో విసిగిపోయిన ఆమె విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కోర్టు విడాకులు మంజూరు చేస్తూ, నెలకు సుమారు రూ. 31,000 భరణం ఇవ్వాలని ఆదేశించినా హే దానికి నిరాకరించాడు. భార్యను రూపాయి లేకుండా రోడ్డున పడేసి, అతడు మాత్రం బ్రాండెడ్ దుస్తులు, కాస్మెటిక్ సర్జరీలతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు.
తన భర్త భారీగా సంపద దాచాడనే అనుమానంతో వాంగ్ రహస్యంగా అతడి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయడం ప్రారంభించింది. ఈ క్రమంలో బ్యాంక్ స్టేట్మెంట్లు, వివిధ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి.. భర్త తనకు తెలియకుండా దాదాపు రూ. 19 కోట్ల (20 మిలియన్ల డాలర్లు) ఆస్తిని దాచాడని ఆధారాలతో సహా కనిపెట్టింది. హే కోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించాడని నిరూపిస్తూ ఆ సాక్ష్యాలన్నింటినీ న్యాయస్థానం ముందు ఉంచింది. ఈ దారుణ ఉదంతం స్థానిక మీడియాలో వైరల్ కావడంతో, భార్య, కూతురిని వంచించిన ఆ క్రూరుడికి చట్టం ప్రకారం కఠినమైన శిక్ష పడాలని, వాంగ్కు న్యాయమైన వాటా దక్కాలని నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు.









