ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి కూటమి ప్రభుత్వం ఉగాది లాంటి తీపి కబురు అందించింది. సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ సిబ్బందికి ఎలాంటి ప్రమోషన్లు, కనీస సౌకర్యాలు కల్పించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆ లోపాలన్నింటినీ సవరించి తమ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
సచివాలయ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. వారి పదోన్నతుల (Promotions) ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇప్పటికే ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని (Cabinet Sub-Committee) ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఖచ్చితంగా ప్రమోషన్ ఛానల్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే విభిన్న ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 7,246 మంది సచివాలయ సిబ్బందికి ఇప్పటికే విజయవంతంగా పదోన్నతులు కల్పించినట్లు మంత్రి బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.
గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల నష్టపోయిన ఉద్యోగులందరికీ న్యాయం చేయడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. పదోన్నతులతో పాటు నోషనల్ ఇంక్రిమెంట్ను కూడా పక్కాగా అమలు చేసి తీరుతామని సచివాలయ అసోసియేషన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సచివాలయ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.









