ప్రపంచ క్రీడా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup) టోర్నీ ఆరంభంలోనే సంచలన వివాదాలతో ఫుట్బాల్ వాతావరణం వేడెక్కింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనే హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగిపోగా.. ఆ మ్యాచ్లో ఓడిపోయిన అల్జీరియా జట్టు ఏకంగా మెస్సీపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
గ్రూప్ స్టేజ్ ఆరంభ పోరులో అర్జెంటీనా జట్టు 3-0 తో అల్జీరియాను పూర్తిగా ఏకపక్షంగా ఓడించింది. మెస్సీ మూడు అద్భుతమైన గోల్స్ చేసి జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. అయితే, మైదానంలో మెస్సీ నిబంధనలను ఉల్లంఘించి ఫౌల్ చేసినప్పటికీ రిఫరీ అతనికి ‘రెడ్ కార్డ్’ ఇవ్వకుండా వదిలేశారని అల్జీరియా ఆరోపిస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెస్సీ కాలు తమ జట్టు కెప్టెన్ మాండీ పిక్కకు బలంగా తాకినట్లు వీడియో విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోందని, అయినా రిఫరీ దాన్ని తీవ్రమైన ఫౌల్గా పరిగణించలేదని అల్జీరియా తమ కంప్లైంట్లో పేర్కొంది. దీనితో పాటు అర్జెంటీనా మిడ్ఫీల్డర్ అలెక్సిస్ అలిస్టర్ కూడా తమ ఆటగాడు ఇబ్రహీం మజాను మోచేతితో నెట్టివేసినా రిఫరీ కనీసం ఫౌల్ కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్కు పోలాండ్కు చెందిన ప్రముఖ రిఫరీ షిమోన్ మార్సినియక్ బాధ్యతలు నిర్వహించారు. గత 2022 ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు తలపడినప్పుడు కూడా షిమోన్ మార్సినియకే రిఫరీగా వ్యవహరించడం విశేషం. ఈ నేపథ్యంలోనే సదరు రిఫరీ అర్జెంటీనా జట్టు వైపు ఏకపక్షంగా మొగ్గు చూపుతున్నారంటూ (ఫేవరెటిజం) అల్జీరియా మీడియా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది.









