హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును మరింత వేగంగా పట్టాలెక్కించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 విస్తరణకు అవసరమైన కేంద్ర నిధులను రాబట్టడం, మరోవైపు ఒకవేళ కేంద్రం నిరాకరిస్తే ఆ తప్పును రాజకీయంగా బీజేపీ ఖాతాలోకి నెట్టేలా ఆయన ఢిల్లీ వేదికగా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్లతో బ్యాక్-టు-బ్యాక్ ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టు ప్రతిపాదనలను వారి ముందుంచారు.
ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం (Takeover) చేసుకోవడానికి అవసరమైన రూ. 13,600 కోట్ల ఐఆర్ఎఫ్సి (IRFC) రుణ నిధుల విడుదలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. అయితే, ఈ రుణ మంజూరుపై కేంద్రం కొన్ని కీలక షరతులు విధించింది. మెట్రో నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని కాకుండా.. ప్రతి నెలా వచ్చే టికెట్ విక్రయాలు, వాణిజ్య ప్రకటనల ఆదాయంలో మొదటి వాటా (First Charge) ఐఆర్ఎఫ్సి రుణ చెల్లింపులకే కేటాయించాలని కేంద్రం స్పష్టం చేయగా, అందుకు సవరించిన ఒప్పందం (Revised MoU) చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది.
ఇక మంగళవారం ఉదయం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక భేటీలో పాల్గొన్నారు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టబోయే మెట్రో ఫేజ్-2 (Phase-II) విస్తరణకు సుమారు రూ. 40,000 కోట్ల భారీ పెట్టుబడి అవసరమని సీఎం అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటూ 50 శాతం ఖర్చును భరించాలని (Joint Venture), ఒకవేళ కేంద్రం అందుకు సిద్ధంగా లేకపోతే కనీసం నిరభ్యంతర పత్రం (NOC) ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు సమీకరించి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి కేంద్రానికి తేల్చి చెప్పారు. ఈ వ్యూహాత్మక పర్యటనతో సీఎం రేవంత్ రెడ్డి బంతిని పూర్తిగా కేంద్రం కోర్టులోకి నెట్టారు.









