గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. 2022లో ఆయనపై నమోదైన వివాదాస్పద కేసును కోర్టు పూర్తిగా కొట్టివేస్తూ, రాజాసింగ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రాజాసింగ్పై మోపిన ఆరోపణలకు ప్రాసిక్యూషన్ సరైన, బలమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేకపోయిందని స్పష్టం చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2022 ఆగస్టులో హైదరాబాద్లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహించడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన యూట్యూబ్లో విడుదల చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాజాసింగ్ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, మంగళ్హాట్ పోలీసులు ఆయనపై 153A, 295A, 505(2) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆ సమయంలో 41A సీఆర్పీసీ నోటీసు నిబంధనలను పాటించలేదంటూ స్థానిక కోర్టు రాజాసింగ్ రిమాండ్ను తిరస్కరించి విడుదల చేసినప్పటికీ.. ఆ తదనంతర శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆయనపై పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించారు. దీంతో రాజాసింగ్ దాదాపు 77 రోజుల పాటు జైలులో గడపాల్సి వచ్చింది. తాజాగా నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ కేసును పూర్తిగా కొట్టివేయడంతో గోషామహల్ ఎమ్మెల్యేకు ఈ సుదీర్ఘ వివాదం నుండి పెద్ద ఉపశమనం లభించినట్లయింది.









