నాకు మంత్రి పదవి ఇవ్వండి.. నీళ్లు తెచ్చి చూపిస్తా: హరీశ్..

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తనకు మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే, కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.

 

మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో కాంగ్రెస్ నేతలు రూ.2,328 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చిందని, ఆ ఒప్పంద పత్రాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తాను చెబుతున్న విషయాలు అబద్ధమని తేలితే తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నదుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ జలాశయాలను నింపడం లేదని, దేవాదుల పంపులను నడపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో 90 శాతం చెరువులు ఎండిపోవడం ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

 

నిపుణుల సలహాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే తాము కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని హరీశ్ రావు సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, దీనికి కేసీఆర్, హరీశ్ రావులే బాధ్యులని జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఇవ్వడం, అలాగే సీబీఐ విచారణకు డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హరీశ్ రావు ఈ విధంగా ఎదురుదాడికి దిగారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు