వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం: సజ్జల రామకృష్ణారెడ్డి..

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు కోట్లాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని అన్నారు.

 

వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన అసలైన రాజకీయ వారసత్వాన్ని జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నారని సజ్జల తెలిపారు. ఎన్ని సవాళ్లు, కుట్రలు ఎదురైనా జగన్ తన పట్టుదల, దార్శనికతతో జనం గుండెల్లో చెరగని విశ్వాసాన్ని సంపాదించుకున్నారన్నారు.

 

ఇదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై సజ్జల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోని అధికార కూటమి మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. ప్రభుత్వంపై జనం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, తప్పుడు వాగ్దానాలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో త్వరలోనే వీరికి బుద్ధి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని… గతం కంటే అద్భుతమైన పాలనను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు