భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం..

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఇంధన భద్రతకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా నుంచి శాంతియుత అవసరాల కోసం భారత్‌కు యురేనియం ఎగుమతులకు మార్గం సుగమమైంది. ఇంధన రంగంలో రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అడుగుగా దీనిని భావిస్తున్నారు.

 

ఆస్ట్రేలియాలో జరిగిన వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అణుశక్తి రంగంలో కీలక ఒప్పందం కుదిరిందని, దీనివల్ల ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం ఏర్పడుతుందని మోదీ తెలిపారు. ఇది దేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు కొత్త ఊతం ఇస్తుందని చెప్పారు.

 

రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇంధన వాణిజ్యం, సరఫరా వ్యవస్థ బలోపేతం, స్వచ్ఛ ఇంధన వినియోగం పెంపుపై కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. 2015లో కుదిరిన అణు సహకార ఒప్పందం కింద యురేనియం ఎగుమతులకు అవసరమైన పరిపాలనా ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి.

 

ఆస్ట్రేలియా నుంచి వచ్చే యురేనియం పూర్తిగా శాంతియుత అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశాయి. దీనిపై ‘ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ’ భద్రతా నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా, ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు కొనసాగిస్తామని వెల్లడించాయి.

 

ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో ఆస్ట్రేలియా, ద్రవ ఇంధనాలు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో భారత్‌ కీలక భాగస్వాములని రెండు దేశాలు గుర్తించాయి. పునరుత్పాదక ఇంధనం, తక్కువ కాలుష్య ఇంధనాలు, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించాయి. బొగ్గు, డీజిల్‌, సహజ వాయువు వంటి ఇంధనాల సరఫరా స్థిరంగా కొనసాగేలా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశాయి. భారత్‌ ప్రారంభించిన గ్లోబల్‌ బయోఫ్యూయెల్స్‌ అలయన్స్‌ కార్యక్రమాన్ని కూడా ఆస్ట్రేలియా స్వాగతించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు