భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ ఊతం..

భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ అవకాశాలు తీసుకురానుందని ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్‌ లక్సన్‌ తెలిపారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి రోజునే న్యూజిలాండ్‌ ఎగుమతుల్లో 57 శాతం వస్తువులు సుంకం లేకుండా భారత్‌లోకి ప్రవేశిస్తాయని వెల్లడించారు.

 

ఈ మేరకు లక్సన్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ “భారత్‌తో వాణిజ్య ఒప్పందం న్యూజిలాండ్‌ వ్యాపారాలకు కొత్త దారులు తెరుస్తుంది” అని పేర్కొన్నారు. భారత్‌ వేగంగా విస్తరిస్తున్న వినియోగదారుల మార్కెట్‌గా మారుతోందని తెలిపారు. ఈ ఎఫ్‌టీఏ తమ దేశ ఆర్థిక ప్రయోజనాలకు కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై రేపు, ఎల్లుండి న్యూజిలాండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్‌కు అధికారిక పర్యటన నిమిత్తం వెళ్లడం ఇదే మొదటిసారి.

 

ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని మోదీ తెలిపారు. 2025 మార్చిలో భారత్‌కు వచ్చిన లక్సన్‌ పర్యటన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

 

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య కీలక ఎఫ్‌టీఏపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీన్ని “తరతరాలకు ఉపయోగపడే అవకాశం”గా లక్సన్‌ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతున్న వేళ ఆ ప్రయాణంలో భాగస్వామ్యం కావడానికి ఈ ఒప్పందం న్యూజిలాండ్‌కు తోడ్పడుతుందని ఆయన అన్నారు.

 

అటు, భారత్‌-న్యూజిలాండ్‌ సంబంధాల్లో ప్రవాస భారతీయుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమని మోదీ గుర్తుచేశారు. న్యూజిలాండ్‌లో వివిధ రంగాల్లో రాణిస్తున్న భారతీయులను కలవాలని తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు