ఆస్పత్రికి వెళ్లడం కోసం ఆటో ఎక్కిన ఓ మహిళపై ఆటో డ్రైవర్ మత్తుమందు ఇచ్చి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధిత మహిళ ఉప్పల్లోని భరత్నగర్ వద్ద ఘట్కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరుతూ ఒక ఆటో ఎక్కింది. అయితే ఆటో డ్రైవర్ ఆమెను నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, మార్గమధ్యంలో భరత్నగర్లోని తాటికల్లు డిపో వద్ద ఆగి కల్లు పార్సెల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆటోను ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) సర్వీస్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించాడు.
నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాక, నిందితుడు ప్లాన్ ప్రకారం ఒక కూల్డ్రింక్లో మత్తు పదార్థాన్ని కలిపి సదరు మహిళతో బలవంతంగా తాగించాడు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. బాధితురాలు స్పృహలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్ ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ను, నగదును కూడా దొంగిలించి, ఆమెను అక్కడే వదిలేసి ఆటోతో సహా పరారయ్యాడు.
కొంతసమయం తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు నెమ్మదిగా కోలుకుని, జరిగిన ఘోరంపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం.. సాంకేతిక ఆధారాలు, ఘటనా స్థలానికి వెళ్లే మార్గాల్లోని సిసిటివి (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. లభించిన కీలక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి, కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితుడైన ఆటో డ్రైవర్ను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.









